
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ.1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం తెలిపారు. రెండేళ్లలో రూ.20,390 కోట్లతో పది మెగా ప్రాజెక్టులు ఏర్పాటు కాగా, 55 వేల మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు. ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. స్టాల్స్ ను పరిశీలించి, ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎగుమతులకు సంబధించిన ప్రత్యేక ఈపోర్టల్ను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్ఫీల్డ్ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు పూర్తి చేస్తామని ప్రకటించారు. మంత్రి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఈ వారంలోనే ఎక్స్ పోర్టు కాన్క్లేవ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.