
తెలంగాణలో భూములు అమ్మకం కానీ కొనుగోలు గాని తెలుసుకోవడానికి మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా జరగడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ధరణి’ వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా ధరణిలో మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. కొత్త పట్టాదార్ పాస్బుక్ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునేందుకు ‘అప్లికేషన్ ఫర్ సక్సెషన్’ మాడ్యూల్ లోనే పాస్బుక్ లేకున్నా దరఖాస్తు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు భూ యజమాని చనిపోతే పాస్ బుక్ ఉంటేనే వారసులు ఆ భూమిని పంచుకునేందుకు అవకాశం ఉండేది. అయితే వివిధ కారణాల వల్ల తమకు పాస్బుక్ రాలేదని అధికారులకు ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాస్బుక్ లేకున్నా దరఖాస్తు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం, ముందుగా ‘అప్లికేషన్ వితవుట్ పాస్బుక్’ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత భూమి వివరాలు, మరణించిన వ్యక్తి వివరాలు, వారి వారసుల వివరాలు నమోదు చేయాలి. మరణ ధ్రువీకరణ పత్రం, ఆ వ్యక్తికి చెందిన ఏదైన ఐడెంటిటీ కార్డు, ఎవరికి ఎంత వాటా కావాలో నిర్ణయించుకొని కుటుంబం మొత్తం కలిసి రాసుకున్న జాయింట్ అగ్రిమెంట్ ను అప్లోడ్ చేయాలి.
ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్కు వెళ్తుంది. కలెక్టర్ పరిశీలించి అనుమతిస్తారు లేదా తిరస్కరిస్తారు. సమాచారం నేరుగా దరఖాస్తుదారుకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఒకవేళ అనుమతిస్తే వారసులు స్లాట్ బుక్ చేసుకొని నేరుగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి సక్సెషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మాత్రం ఈ ఆప్షన్ వర్తించదని అధికారులు తెలిపారు.