
తిరుమల శ్రీవారికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెండి సాలగ్రామ హారాన్ని బహూకరించారు. కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. మొక్కులో బాగంగా శ్రీనివాసుడికి వెండి సాలగ్రామ హారాన్ని సమర్పించారు. అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. అంతకుముందు వారికి ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.