
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణేశ్ నిమజ్జనాన్ని ఎక్కడికక్కడ స్థానికంగా నిర్వహించడమే మేలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ప్రజల సెంటిమెంటును గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా అమలు చేయాల్సిన ఆంక్షలు, నియంత్రణ చర్యలను సూచించాల్సిందిగా ప్రభుత్వన్ని కోరింది. హుస్సేన్ సాగర్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలను నిషేధించాలన్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
‘‘ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే.. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాలుష్య ముప్పు నుంచి హుస్సేన్ సాగర్ ను కాపాడేలా చర్యలు తీసుకోవాలి. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ దీనిపై నివేదికలు సమర్పించాలి. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఈ నెల 6న తగిన ఆదేశాలు జారీ చేస్తాం’’ అని హైకోర్టు తెలిపింది.