
కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా చికిత్సను మొత్తం 17 రకాలుగా విభజించగా, అందులో 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలో వైద్యం అందిస్తారు. క్రమంగా దీనిని ప్రైవేటు ఆసుపత్రులకూ విస్తరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (ఏబీ) పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నారు. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో… ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చినట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో ఇక నుంచి ‘ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్’ పేరిట ఈ పథకం అమలవుతుందని వైద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలుతో మొత్తం 1,668 వ్యాధులకు ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వాసుపత్రుల్లోనే అందించాలని నిర్ణయించారు. 50 పడకలు ఉన్న ఆసుపత్రులకు మాత్రమే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అనుమతి లభిస్తోంది. ఆయుష్మాన్ భారత్ చేరికతో ఇక నుంచి 6 పడకలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.