
సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం `జై భీమ్`. ఇటీవల విడుదలై ఓటీటీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ ని మించిన గౌరవం దక్కించుకుంది ఈ సినిమా. తమిళనాడు కు చెందిన జస్టిస్ చంద్రు కెరీర్ లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. జ్ఞాన్ వేల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని మణికందన్ (రాజన్న), లిజో మోల్ జోసే (చిన్నతల్లి) పాత్రలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నాయి. నిజజీవితంలో ఆ పోరాటం చేసిన వ్యక్తి పార్వతి అమ్మాళ్. ఆమె పరిస్థితి చూసి సూర్య చలించిపోయి ఆర్థిక సాయం అందించారు.
ఆమె పేరు మీద రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, ఆ మొత్తం పై ప్రతినెలా వచ్చే వడ్డీ ఆమె కు అందేలా చేశారు. ఇంతకుముందు.. గిరిజనుల సంక్షేమానికి సూర్య రూ. కోటి విరాళం అందించారు. మరో వైపు..నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్.. పార్వతి అమ్మాళ్ కు ఇల్లు కట్టిస్తానని ఇటీవల ప్రకటించారు. వాస్తవ సంఘటనల ఆధారిత కథల్లో నటించి, సంబంధిత వ్యక్తులకు సాయం చేస్తున్న సూర్య పై ఆయన అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
1993 లో కస్టడీలో చంపబడిన భర్త రాజకన్నకు న్యాయం జరగాలంటూ భార్య పార్వతి అమ్మాళ్ చేసిన న్యాయపోరాటం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. బడుగుబలహీన వర్గాల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చిన చిత్రంగా ప్రశంలందుకుంటోంది. ఈ సినిమా చూసిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏకంగా సూర్యకి ఓ లెటర్ కూడా రాసారు.