
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి భూ అక్రమాలకు సహకరించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐఏఎస్ అధికారి ముసుగులో సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ కు బంట్రోతుగా పని చేశారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ పలు విమర్శలు చేశారు.
భూముల వ్యవహారంలో టీఆర్ఎస్ కు అనుకూలం పని చేశాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదని, వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనుక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని, దీని విచారణ నుంచి అప్పట్లో వెంకట్రామిరెడ్డి తప్పించుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఇంకో ఏడాదిలో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన్ను కాపాడేందుకే సీఎం కేసీఆర్ ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీని చేస్తున్నారని విమర్శించారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందని, అందుకే ఆయనకు ఏ ప్రభుత్వమైనా కీలక బాధ్యతలు అప్పగించిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు కూడా నిబంధనలను ఉల్లంఘించిన పని చేశాడని, అందుకే వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాధ్యతలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వివరాలు దొరకడంలేదని పేర్కొన్నారు. భూములతో పాటు పలు అంశాల్లో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన చరిత్ర వెంకట్రామిరెడ్డిదే అన్నారు. కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోకాపేట భూముల వేలంలో వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజ్ పుష్ప అనే సంస్థ పాల్గొందన్నారు. రాజ్ పుష్ప సంస్థ కోకాపేట భూములు దక్కించుకుందని వెల్లడించారు.