
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీజేఎస్ (తెలంగాణ జన సమితి) చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిట్లర్ పుస్తకాలు చదివి కేసీఆర్ కూడా నియంతలా మారారని వ్యాఖ్యానించారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ ధర్నాచౌక్లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.
విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేటు దోపిడీకి వదిలేసిందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రఘుశంకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలమల్లేష్, ప్రొ. లక్ష్మణ్, విరసం నేత రాంకీ, డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, నాయకుడు రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.