
బీసీ ఉద్యమానికి మద్దతుగా తన వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యమించే సమయంలో బీసీలు ఒకటిగానే ఉంటున్నా.. ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని వ్యాఖ్యానించారు. వెనకబడిన కులాలకు రాజ్యాధికారం తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. 2024 ఎన్నికల సమయానికి బీసీలు స్పష్టమైన అజెండాతో ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. మంగళవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి చెందిన పలువురు నాయకులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. 23వ తేదీన హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించే జాతీయ స్థాయి సెమినార్ కి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి కులగణన, రిజర్వేషన్ల కల్పనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమం తాలూకు భావ వ్యాప్తికి నేను కట్టుబడి ఉన్నాను. అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆ కులాలకు స్వయం ప్రతిపత్తి, రాజ్యాధికారం తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. బీసీల హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమం తాలూకు భావ వ్యాప్తిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది’ అని పవన్ వ్యాఖ్యానించారు. ‘ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నా అసలు సమయానికి ఆచరణకు నోచుకోవడం లేదు. అందుకు రాజకీయపరమైన అవగాహన అవసరం. అందుకు సంబంధించి మథనం జరగాలి. యువతకు నాయకత్వాన్ని అప్పగించాలి. రాజకీయంగా ముందుకు వెళ్లాలి. బీసీ ఉద్యమానికి మద్దతుగా నా వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.