
కొవిడ్ టీకా తీసుకునే వారిపై కానుకల జల్లు కురిపించనుంది తమిళనాడులోని ఓ జిల్లా యంత్రాంగం. రేపు ఆదివారం (అక్టోబరు 10న) జరగనున్న మెగా డ్రైవ్ లో వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్ మెషీన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ తో సహా పలు బహుమతులను అందజేయనున్నారు. కరూర్ జిల్లా కలెక్టర్ టి.ప్రభు శంకర్ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో టీకా వేయించుకున్న వారి కోసం జిల్లా యంత్రాంగం లక్కీ డ్రా నిర్వహించనుంది. విజేతలకు బహుమతులు అందజేస్తాం…’ అని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్ మెషీన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ అందజేయనున్నారు. 24 ప్రెషర్ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నాయి. టీకా కేంద్రాలకు ప్రజలను తరలించే వారికి రూ.5 చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. 25 మంది కంటే ఎక్కువ మందిని తీసుకువచ్చే వలంటీర్ పేరు లక్కీ డ్రాలో చేర్చుతారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసించారు.