
సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ కింది భాగంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార చిత్రాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) తొలగించింది. ఆ ఫోటో స్థానంలో విద్యుత్ వెలుగుల్లో ఉన్న సుప్రీంకోర్టు భవనం ఫోటోను పెట్టింది. 75వ స్వాతంత్య్ర అమృతోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్ సైట్లు, ఈ-మెయిల్స్ లో సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో పాటు మోదీ ఫొటోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఉంచుతోంది. ఎన్ఐసీ నిర్వహించే అన్ని ఈ-మెయిల్స్ కీ దీన్ని అనుసంధానం చేసింది. ఈ విషయాన్ని కొందరు లాయర్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దృష్టికి తీసుకు వెళ్లడంతో రిజిస్ట్రీ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్ అడుగు భాగంలో పొందుపరచడం సరికాదని స్పష్టం చేసింది. వెంటనే ఆ బొమ్మని తొలగించాలని ఎన్ఐసీని ఆదేశించింది.
దీనిపై తక్షణ చర్యలకు దిగిన ఎన్ఐసీ.. సుప్రీంకోర్టు ఈ-మెయిల్ కింద భాగంలోని మోదీ ప్రచార చిత్రాన్ని తొలగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘న్యాయవ్యవస్థ కార్యకాలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్ అడుగుభాగంలో పొందుపరిచినట్లు గురువారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దష్టికి వచ్చింది. దాంతో ఆ బొమ్మను తొలగించాలని కోర్టుకు అధికారిక ఈ-మెయిల్ సమకూరుస్తున్న ఎన్ఐసీని ఆదేశించాం’ అని పేర్కొంది.