
ప్రస్తుతం రాజకీయ నాయకుల పాదయాత్రల ట్రెండ్ నడుస్తోంది. 2018 కి ముందు ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పాదయాత్ర ద్వారానే ప్రజలకు చాలా దగ్గర అయ్యాడు. ప్రస్తుత సీఎం పదవి రావడానికి కూడా ఆయన చేసిన పాదయాత్రే కారణం అని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఈ ట్రెండ్ ప్రస్తుతం తెలంగాణాలో నడుస్తుంది. ఈ మధ్యనే బీజేపీకి చెందిన బండి సంజయ్, ఈటల రాజేందర్ పాదయాత్రలు చేశారు. ప్రస్తుతం వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పుడు మరో తెలంగాణ నేత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కి ఈయన అత్యంత సన్నిహితుడు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దగ్గరి వాడు . తాను కూడా పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,300 కిలోమీటర్ల ప్రజా చైనత్య యాత్రను చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకే పాదయాత్రను చేపట్టినట్టు చెప్పారు. ఈ నెల 9వ తేదీ నుంచి డీసీసీ మండల, టౌన్ అధ్యక్షులకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు.