
రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. చలాన్ ను సైతం ఆయన చెల్లించారు. నిబంధనలు ప్రజలకైనా ప్రజాప్రతినిధులకైనా ఒకటే అని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. నిజాయితీగా నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళల ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు వాహనంలో తాను లేనని చెప్పారు.
బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు చలాన్ విధించారని గుర్తు చేశారు. రూల్స్ ప్రకారం ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు నడుచుకున్న విధానం చాలా అద్భుతమని కొనియాడారు కేటీఆర్. తన వాహనానికి చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు శాలువా కప్పి అభినందించారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సరైన సందేశం అందేందుకే ఈరోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని కేటీఆర్ కోరారు.