
దళితబంధును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా గిరజన బంధును కూడా తక్షణమే ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా రాంపూర్ తాండాలో జరిగిన దళిత, గిరిజన దండోరా దీక్షలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో లేక ఇతర బలహీనవర్గాలకు చెందిన వ్యక్తో సీఎం అవుతారని చెప్పారు. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు సీఎంవో కార్యాలయంలో చోటు ఇవ్వగానే దళితులందరికీ ఇచ్చినట్టా? అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి పది లక్షలు ఇస్తే ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని అన్నారు. మీ కూతురు కవితకు టికెట్ ఇచ్చినా ఆమెను గెలిపిస్తానని కోమటిరెడ్డిచెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక కోకాపేట భూములు అమ్మిన బ్రోకర్ కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో ఏడుగురు రెడ్లు, నలుగురు వెలమలకు స్థానం కల్పించిన కేసీఆర్.. దళితులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు.