
తక్కువ ధరలో అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్యం అందించడమే బసవతారకం ఆస్పత్రి లక్ష్యమని బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ రేడియోగ్రఫీ యంత్రాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్యాన్సర్ రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి గడప తొక్కిన ప్రతీ రోగికి… దేవాలయంలో అడుగుపెట్టిన భావన కలుగుతోందంటే.. దాని వెనక ఎంతో మంది కృషి దాగి ఉందన్నారు. ఆస్పత్రిలో సేవలందిస్తూ.. ఎంతో మంది రోగులను సాధారణంగా మార్చటంలో కృషి చేస్తూ.. పేరుప్రతిష్ఠలు తెచ్చిపెడుతున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు, అభినందనలు అని బాలకృష్ణ పేర్కొన్నారు. ‘పెరుగుతున్న రోగులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వైద్యసేవలను ఆధునీకరించుకుంటున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో రోగులకు వైద్యం అందించాలన్న మా తల్లిదండ్రుల లక్ష్యాన్ని నెరవేర్చటమే మా బాధ్యత. అందులో భాగంగానే డిజిటల్ రేడియోగ్రఫీ యంత్రాన్ని.. రూ. 50 లక్షలు ఖర్చుపెట్టి ప్రారంభించాము. దేశంలో ఎక్కడా లేని విధంగా.. అత్యాధునిక పరికరాలతో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాం. ఆధునికతతో పాటు పేద ప్రజలకు అందుబాటు ఖర్చులోనే వైద్యం అందిస్తూ ముందుకు సాగుతున్నాం. ఎలాంటి కొత్త టెక్నాలజీనైనా బసవతారకం ఆసుపత్రిలో ప్రవేశపెట్టేందుకు తామెప్పుడూ ముందుంటాం’అని బాలకృష్ణ స్పష్టం చేశారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ రేడియోగ్రఫీ యంత్రంతో 8 గంటల్లో దాదాపు 200 లకు పైగా ఎక్స్రేలు తీయోచ్చని బసవతారకం ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. డిజిటల్ రేడియోగ్రఫీ ఎంతో వేగవంతమైనదని తెలిపారు. సాధారణంగా ఫిల్మ్ పైన తీసే ఎక్స్ రేని డిజిటల్ రూపంలో వెంటనే చూసే వీలుంటుందని వివరించారు.