
ఇప్పుడు హోటల్ గాని, టీ స్టాల్ లో గాని ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కప్ లకు బదులు పేపర్ టీ కప్స్ దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్పై నిషేధం విధించిన తర్వాత దేశమంతటా పేపర్ కప్పుల వినియోగం పెరిగింది. టీ స్టాల్స్, జ్యూస్ సెంటర్లు, ఐస్క్రీమ్ పార్లర్లలో అంతటా పేపర్ కప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పేపర్ కప్ లు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. కానీ, మన శరీరానికి మాత్రం ఎంతో హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఖరగ్పూర్ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో పేపర్ కప్పుల్లో టీ, ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తేలింది.డిస్పోజబుల్ పేపర్ కప్పులో మూడుసార్లు 100 మి.లీ. చొప్పున వేడి వేడి టీ తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని పరిశోధకులు వెల్లడించారు. 80-90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మి.లీ. ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరతాయని తెలిపారు. క్రోమియం, కాడ్మియం వంటి హానికారక లోహాలు శరీరంలోకి వెళ్తాయని పేర్కొన్నారు. రైళ్లలో వెళ్లే వారికి పేపర్ కప్పుల్లో నే టీ ఇస్తుంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఆ కప్పుల్లో టీ తాగక పోవడమే మంచిది. లేదంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.