
టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పాండ్యా వద్ద గల అత్యంత ఖరీదైన వాచ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత యూఏఈ నుంచి భారత్కు తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వాచ్ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు. అయితే గత ఏడాది ఐపీఎల్ 2020 తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిన హార్దిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా దగ్గర కూడా కస్టమ్స్ అధికారులు బంగారం గుర్తించిన విషయం తెలిసిందే.
అప్పుడు దానిని సీజ్ చేసి కృనాల్ ను విడిచి పెట్టిన అధికారులు ఇప్పుడు హార్దిక్ ను అరెస్ట్ చేస్తారా.. లేదా వదిలేస్తారా అనేది చూడాలి. కాగా, హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ప్రముఖమైంది. ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్తో రూపొందించబడింది.
32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్లెట్ కూడా ఉంటుంది. అంతేకాదు కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్ను తయారు చేసి ఇస్తారు. ఇక ఐపీఎల్ 2021 రెండో అంచె ప్రారంభానికి ముందుకు హార్దిక్ పాండ్యా ఈ వాచీని ధరించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.