
5-11ఏళ్ల వయస్సు గల పిల్లలకు కరోనా టీకా అందించాలని అమెరికా భావిస్తున్న తరుణంలో ఎఫ్ డీఏ కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలపై ఫైజర్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫైజర్ అందించిన డేటాను పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేసింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో వ్యాధి సోకకుండా ఫైజర్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. ఏ పరిస్థితుల్లోనైనా.. చిన్నారులకు టీకా ద్వారా కలిగే సైడ్ ఎఫెక్ట్ ల కన్నా, వ్యాక్సిన్ చేసే మంచే ఎక్కువగా ఉందని ఎఫ్ డీఏ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
కొవిడ్ సోకిన చిన్నారులు టీకా తీసుకుంటే చాలా సందర్భాల్లో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి రాదని, మరణం నుంచి కూడా రక్షణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు.శాస్త్రవేత్తలు ఇంత సానుకూలంగా ఉన్నా.. 5-11 మధ్య వయస్సు గల చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఎఫ్ డీఏ ఇంకా అనుమతులు ఇవ్వలేదు. మంగళవారం జరగనున్న సమావేశంలో స్వతంత్ర సలహాదారులతో కూడిన ప్యానెల్ ఈ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకొనుంది. ఆ తర్వాత ఎఫ్ డీఏ తుది నిర్ణయానికొస్తుంది.
ఒకవేళ ఎఫ్డీఏ అనుమతులిస్తే.. నవంబర్ తొలి వారం నుంచి చిన్నారులకు టీకా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 12 అంతకుమించిన వయస్సు వారికి ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు టీకా వార్త కోసం ఎదురుచూస్తున్నారు. డెల్టా వేరియంట్ నుంచి తమ పిల్లలను రక్షించాలని, తద్వారా వారిని స్కూళ్లకు పంపించవచ్చని ఆశిస్తున్నారు.
అమెరికాలో 5-11ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 28 మిలియన్ల మంది ఉన్నారు. వారికి ఇచ్చేందుకు టీకాలు సిద్ధమేనా? అన్న అంశంపై వచ్చే వారంలో ఎఫ్ డీఏ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరగనుంది. ఈ తరుణంలో ఫైజర్ ఇచ్చిన డేటాను విశ్లేషించి, ఆ వివరాలను విడుదల చేసింది ఎఫ్ డీఏ.