
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించింది. దుబాయ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రాహుల్, ఇషాన్ కిషన్.. టీమ్ ఇండియాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
రాహుల్ తన క్లాస్ ఇన్నింగ్స్ తో 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 51 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్ తో కలిసి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు కిషన్. 46 బంతుల్లో 70 పరుగులు చేసిన అనంతరం రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. చివర్లో పాండ్యా (12) మెరవడం వల్ల కోహ్లీసేన విజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు శుభారంభం అందించేందుకు కృషి చేశారు ఓపెనర్లు జాసన్ రాయ్ (17), బట్లర్(18). కానీ వీరిద్దరినీ పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో ఆనందం నింపాడు షమీ. తర్వాత వచ్చిన డేవిడ్ మలన్ (18) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అనంతరం బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ ఆడారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. పరుగులు సాధించారు.
వీరి ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతున్న క్రమంలో లివింగ్ స్టోన్ (30)ను బౌల్డ్ చేశాడు షమీ. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో బెయిర్స్టో (49)ను బుమ్రా బోల్తా కొట్టించడం వల్ల 163 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. చివర్లో మొయిన్ అలీ (43) కాసేపు మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు.