
ఏపీలో సుమారు 50 ఇంజినీరింగ్ కళాశాలలకు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపును నిలిపివేయనున్నారు. గత రెండేళ్లుగా లోపాలను సరి చేసుకుంటామని హామీ ఇస్తూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోనున్నారు. తక్కువ విద్యార్థులు, మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలల కొరతతో పాటు.. విద్యార్థులు, అధ్యాపకుల ఫిర్యాదులనూ పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. ఇంజినీరింగ్ సీట్లు అధికంగా ఉండడం, విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండడంతో నాణ్యత లేని కళాశాలలను తగ్గించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు వర్సిటీలకు సమాచారం అందించింది. గతేడాది 90 కళాశాలలపై చర్యలు తీసుకోవాలని భావించినా చివరికి 40 కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిలిపివేశారు. ఈ ఏడాది మరికొన్ని కళాశాలలపై చర్యలకు సిద్ధమవుతున్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ నివేదికల ఆధారంగా అనుబంధ గుర్తింపు నిలిపివేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఒక్క కృష్ణా జిల్లాలోనే 7-8 కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 1,44,451 సీట్లకు వర్సిటీలు ఆమోదం తెలిపాయి. వీటిలో 92,157 భర్తీ అయ్యాయి. అన్ని కళాశాలల్లో కలిపి 36 శాతం సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ ఏడాది ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తున్నాయి.