
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానెపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు మాజీలు. ఇంగ్లాండ్ టూర్లో ఐదు సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు ముగిసాయి.. ఈ రెండు టెస్ట్ ల్లో వైస్ కెప్టెన్ రహానె చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు. మరీ ముఖ్యంగా.. మిడిలార్డర్లో భాగస్వామ్యాలను నిర్మించడంలో రహానె విఫలమవుతున్నాడు. ఈ సందర్భంలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఫరూక్ ఇంజినీర్.. రహానెపై విమర్శలు గుప్పిస్తూ పరోక్షంగా అతనిపై వేటు వేయాలని సూచిస్తున్నారు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్కి రహానె లేదా పుజారాలో ఒకరిపై వేటు వేసి సూర్యకుమార్ యాదవ్ని ఆడించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇంగ్లాండ్తో మూడో టెస్టు సన్నద్ధతపై అజింక్య రహానె మీడియాతో మాట్లాడుతుండగా.. విమర్శలపై చర్చ వచ్చింది. ఈ నేపథ్యంలో రహానె స్పందిస్తూ నా గురించి అందరూ మాట్లాడటంపై ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే.. ముఖ్యమైన వారి గురించి వాళ్లు మాట్లాడతారు. కాబట్టి.. ఆ విమర్శలను నేను పట్టించుకోవడం లేదు.
చతేశ్వర్ పుజారా, నేను సుదీర్ఘకాలంగా భారత్ టెస్టు టీమ్కి ఆడుతున్నాం. ఒత్తిడిని ఎలా అధిగమించాలో మాకు బాగా తెలుసు. ఫామ్ గురించి కూడా మాకు బెంగ లేదు. మా ఫోకస్ అంతా టీమ్ని గెలిపించడంపైనే ఉంది. ఆ విమర్శల గురించి ఆలోచించం అని రహానె స్పష్టం చేశాడు.