
నేటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం, వ్యవసాయం పట్ల విముఖతను కలిగి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహా ధర్నాలో సీఎం పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్ర వైఖరి మార్చుకోవాలని, రైతు నిరంకుశ చట్టాలను విరమించుకోవాలని, కరెంటు బకాయిల మీటర్లు పెట్టే విధానాన్ని మార్చుకోవాలని అనేకసార్లు చెప్పాం. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు.
రైతుల మహాధర్నాకు సంఫీుభావంగా విచ్చేసిన పార్టీ ప్రజాప్రతినిధులందరికీ సీఎం కేసీఆర్ స్వాగతం తెలిపారు. ధర్మంగా, న్యాయంగా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కేంద్రం విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. కేంద్రానికి మన రైతుల గోసలను, బాధలను విన్నవించాం. పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టాం. కానీ కేంద్రం నుంచి స్పందన లేదన్నారు.
నిన్న స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ ఉలుకు పలుకు లేదని విమర్శించారు. మన బాధ ప్రపంచానికి, దేశానికి తెలియాలని చెప్పి ఈ ధర్నాకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణ గ్రామాల్లో కూడా వివిధ రూపాల్లో పోరాటాలను ఎంచుకుంటాం. ముందుకు కొనసాగుతూనే ఉంటాం. దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని ఉప్పెనలా కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.