
తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ మహాధర్నా చేస్తున్న రోజే కేంద్రం కేసీఆర్ కి కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. కేంద్ర – రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదు అని. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నాం అని, ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయి కావున అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం అని, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని , ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది.
అంతేకాక యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది అని డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం అని కేంద్రం ప్రకటించింది.