
బీర్ల కంపెనీలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) షాకిచ్చింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ధరలు పెంచుతున్నారంటూ ఆయా కంపెనీలకు శుక్రవారం భారీ జరిమానా విధించింది. కంపెనీలకు దిమ్మతిరిగేలా రూ.873కోట్లు చెల్లించాలని ఆదేశించింది. యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్, కార్లెస్ బర్గ్ ఇండియా, ఆల్ ఇండియా బ్రేవరీస్ అసోసియేషన్ లతో పాటు మరో 11 కంపెనీలకు ఈ జరిమానా విధించింది. బీర్ల కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచుతున్నాయని, నిబంధనలు పాటించడం లేదన్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సీసీఐ సుమారు నాలుగేళ్ల పాటు విచారణ చేపట్టింది.
ఈ మేరకు ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో బీర్ల కంపెనీలు అమ్మకాలు, సరఫరాల్లో కూటమిగా ఏర్పడి మార్కెట్ స్వేచ్ఛను దెబ్బతీశాయని ఆరోపించింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ సేల్, సప్లై విషయంలో ఫైన్ విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. కంపెనీలను సీజ్ చేయకుండా కేవలం జరిమానా మాత్రమే విధించినట్లు తెలిపింది. అది కూడా అతి తక్కువ మొత్తమేనని వెల్లడించింది.