
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి గాను మద్యం పాలసీని ప్రకటించింది. దీని ప్రకారం… ప్రస్తుతం ఉన్న రిటైల్ ఔట్ లెట్ల సంఖ్య లో ఎలాంటి మార్పులు తీసుకు రాలేదు. గత సంవత్సరం తరహాలోనే 2,934 దుకాణాల్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడాదిపాటు ఈ దుకాణాల లైసెన్సులు అమల్లో ఉంటాయని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. గత ఏడాది విడుదల చేసిన మద్యం విధానాన్నే దాదాపు కొనసాగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ బార్గవ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం క్రయ విక్రయాల్లో పారదర్శకత పాటించనున్నట్లు స్పష్టం చేసింది. ఇకపై మద్యం విక్రయాలకు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు.
పర్యాటక సౌకర్యాలు అందించే కేంద్రాల్లో మద్యం అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాకిన్ స్టోర్ల ఏర్పాటుకు బేవరేజెస్ కార్పోరేషన్ కు అనుమతులు మంజూరు చేసింది. 2021 అక్టోబరు 1 తేదీ నుంచి 2022 సెప్టెంబరు 30 తేదీ వరకూ మద్యం దుకాణాల లైసెన్సులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గం వరకూ రహదారిపై మద్యం దుకాణాలను, పర్మిట్ రూములను అనుమతించబోమని ప్రభుత్వం గెజిట్ లో స్పష్టం చేసింది. టూరిజం కార్పోరేషన్ విజ్ఞప్తి మేరకు టూరిజం ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనూ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.