
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టి నిర్ణీత వ్యవధిలో భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని న్యాయస్థానం పేర్కొంది. 33 జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదికలు సమర్పించాలని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపించాలని.. రికార్డులోని ప్రభుత్వ భూములను సర్వే చేయొద్దని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించాలని తెలిపింది. సబ్ రిజిస్ట్రార్లకు అనుమానం వస్తే ముందుగా కలెక్టర్లను సంప్రదించాలని సూచించింది. భూముల సర్వే, వివరాల నమోదును కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కోర్టు పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను వారం రోజుల్లో కలెక్టర్లకు పంపించాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ అక్టోబరు 27కి వాయిదా వేసింది. ప్రభుత్వ భూములను జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని.. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు తెలిపింది.