
దేశ వ్యాప్తంగా కోవిడ్-19 తీవ్రత తగ్గడంతో పుణ్యక్షేత్రాల్లో క్రమంగా కరోనా నిబంధనలు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ప్రతి రోజూ గరిష్టంగా 25 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది కరోనా వ్యాప్తి బాగా తగ్గిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
శబరిమల దర్శనాలకు సంబంధించి ఐదు దక్షిణాది రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్ లాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, భక్తులకు ఈ విషయం తెలిసేలా ప్రచారం కల్పించాలని కేరళ ప్రభుత్వం కోరింది. శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించరు. ఇక పంబానది స్నానం ఈ ఏడాది కూడా లేదని కేరళ ప్రభుత్వం తెలిపింది. నది వెంబడి ఏర్పాటు చేసిన షవర్ల కిందే స్నానం చేయాలని సూచించింది. దర్శనానికి 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకున్న వారికే అనుమతి ఇస్తామని తెలిపింది.
శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం సూచనలు :
► శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
► రెండు డోసుల కరోనా టీకా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం వెంట తీసుకురావాలి. లేదా దర్శనానికి 72 గంటల ముందుగా పరీక్ష చేయించుకుని, కోవిడ్ నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి.
► శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించరు.
► పంబా నదిలో స్నానాలపై ఆంక్షలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. నదీ స్నానాలకు బదులు కేవలం నది వెంబడి షవర్ స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.