
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సెలూన్లు, లాండ్రీ దుకాణాల యజమానులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ కేంద్రాల్లోనూ ఉచిత నమోదు సౌకర్యం కల్పించామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు తక్కువ మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సెలూన్లు, లాండ్రీ దుకాణాలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రజక, నాయీ బ్రాహ్మణుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.