
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది అనే టైం లో పార్టీ పగ్గాలు చేపట్టి, ఒక ఒడ్డు నా పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు హవా కొనసాగుతుంది. ఊహించని విధంగా తెలంగాణ పీసీసీ దక్కించుకున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వం ను ఇరుకున పెట్టే విధంగా తీవ్ర విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. రేవంత్ టార్గెట్ లో పలువురు మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని కాంగ్రెస్ నాయకత్వం బాగానే టార్గెట్ చేసి విమర్శలు చేసింది. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో పనిచేసిన ఇంద్రకరణ్ 2014లో బిఎస్పి పార్టీ తరుపున నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళి మంత్రి అయ్యారు. అలాగే 2018 జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక ఈయన ప్రత్యర్ధి కాంగ్రెస్ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్లో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి నేతృత్వంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై నిర్మల్లో ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలో మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. దీనికి కొనసాగింపుగా మహేశ్వర్ రెడ్డి సైతం, ఇంద్రకరణ్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మంత్రిగా ఇంద్రకరణ్ నిర్మల్లో చేసిన అభివృద్ధి ఏం లేదని, గ్రామాల్లో రోడ్లు సరిగా లేవని, ప్రజలకు సరైన సౌకర్యాలు లేవని చెబుతున్నారు. భూకబ్జాలు, కంకర మిషన్ కోసమే ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి అయ్యారని ఆరోపిస్తున్నారు.
ఆరోపణలు వచ్చాయని ఈటల రాజేందర్ని మంత్రివర్గం నుంచి తప్పిస్తే, ఇంద్రకరణ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నిర్మల్లో ఇంద్రకరణ్కు ఎలాగైనా చెక్ పెట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అని రేవంత్ చూస్తున్నారు. అందులో భాగంగానే మహేశ్వర్ రెడ్డి దూకుడుగా నిర్మల్లో రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.