
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనలో.. పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడ్ని పట్టుకున్నారంటూ ఈ నెల 12న మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్.. ఇప్పుడు వివాదాస్పదమైంది. నిందితుడు పరారీలో ఉన్నాడని, ఆచూకీ చెప్పిన వారికి రూ.పది లక్షలు బహుమతి ఇస్తామని తాజాగా పోలీసులు ప్రకటించడంతో.. నెటిజన్లు కేటీఆర్ పై మండిపడుతున్నారు. ‘మంత్రిగారూ.. నిందితుడు ఎక్కడ?’ అని ప్రశ్నిస్తున్నారు. ఏ ఉద్దేశంతో మంత్రి గారు ఆ ట్వీట్ పెట్టారో చెప్పాలని నిలదీస్తున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించిన ఆయనకు మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శిస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా నెటిజన్లకు జత కలిశారు. కేటీఆర్ ట్వీట్ ను తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘నిందితుణ్ని గంటల్లోనే పట్టుకున్నామని కేటీఆర్ అంటారు. ఆచూకీ చెబితే.. రూ.10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటిస్తారు. ఈ రెండింటిలో ఏది నిజం’’ అని రేవంత్ ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షాత్తూ ఓ మంత్రే ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు.
Would like to correct my tweet below. I was misinformed that he was arrested. Regret the erroneous statement
The perpetrator is absconding & @hydcitypolice has launched a massive manhunt for him
Let’s all make our best efforts to ensure he’s nabbed & brought to justice quickly https://t.co/IVz9Ri7jzn
— KTR (@KTRTRS) September 14, 2021
కాగా, ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి కేటీఆర్.. తాజాగా మరో ట్వీట్ లో స్పందించారు. నిందితుడ్ని పట్టుకున్నామంటూ తాను చేసిన ట్వీట్ పై విచారం వ్యక్తం చేశారు. ‘‘నిందితుడి అరెస్టుపై నాకు తప్పుడు సమాచారం వచ్చింది. దాని ఆధారంగానే ట్వీట్ చేశాను. అంతే తప్ప.. ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం నాకు లేదు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.