
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీరుపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వర్షాకాల పార్లమెంట్ జరుగుతన్న సమయంలో దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రుల ఫోన్ లు ట్యాపింగ్ కి గురి అయ్యినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారం పై ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ పెదవి విప్పకపోవడం తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .
దేశంలో ప్రముఖులు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు తో బాటు బడా వ్యాపారవేత్తలు ఫోన్లను సైతం కేంద్రం ట్యాపింగ్ చేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిపోయింది. ఇన్ని రోజులుగా పార్లమెంట్లో ఇదే విషయమై గందరగోళం జరుగుతోంది. గడిచిన నాలుగు రోజులుగా పార్లమెంట్ దద్దరిల్లుతోంది.
దాదాపు లక్ష మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలిసిన పేర్లు మాత్రం 400 వరకు ఉంటాయని సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ పై ప్రముఖుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని చెప్పడం గమనార్హం. ఇంకా కొన్ని వేల మంది వరకు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజురోజుకు బాధితుల పేర్లు పెరుగుతుండడం ఆందోళన కలుగుతోంది.
దీనిలో భాగంగానే తెలుగు నాట ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ప్రచారం సాగుతోంది. విదేశీ సాంకేతిక సహకారంతో వ్యక్తులకు తెలియకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేసే విధానం ఉందని తెలిసిందే. దీంతోనే ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతున్నారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల వ్యూహాలను పసిగడుతున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.