
చిన్న ఆలయాల నిర్వహణ బాధ్యతలను అర్చకులకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది. చాల చోట్ల ఆలయాల్లో వార్షికాదాయం రూ.లక్షలోపే ఉంటోంది. మరికొన్నింటికి పండుగలు, జాతరల సమయంలో కలిపి రూ.2 లక్షలలోపు వార్షిక రాబడి ఉంటోంది. ఇలాంటి చిన్న ఆలయాలను అక్కడి అర్చకులకు అప్పగిస్తే వారు స్థానిక భక్తులు, దాతల ద్వారా ఆలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుందని అర్చక సమాఖ్య ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల దేవాదాయశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ ఉన్నతాధికారులు.. ఏపీ అర్చక సమాఖ్య, అర్చక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వంశపారంపర్య అర్చకులు, వారి వారసుల్లో 16 ఏళ్లు దాటిన వారి పేర్లను దేవాదాయ శాఖ 43(10) రిజిస్టర్ లో నమోదు చేసేలా నిర్ణయించారు. సెప్టెంబరు నెలాఖరుకు వీటి నమోదు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అర్చకులకు వైద్య ఖర్చులు, విద్య, గృహనిర్మాణ రుణాలు, గ్రాట్యుటీ తదితరాలు అర్చక సంక్షేమ నిధి నుంచి ఖర్చు ఇస్తారు. మూడేళ్ల కిందట ఈ ట్రస్టు బోర్డు గడువు ముగిసింది. దీంతో త్వరలో ఈ బోర్డును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.5 లక్షలపైన ఉండే ఆలయాల్లో అర్చకులకు సేవల వేతన (సర్వీస్ రెమ్యునరేషన్) పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికి సెప్టెంబరు నెలాఖరులోగా ప్రతిపాదనలను తీసుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో రూ.2-25 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న ఆలయాలు (6బి) 1,289 ఉన్నాయి. వీటిలో వెయ్యికి పైగా ఆలయాలకు రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఆ ఆలయానికి వచ్చే ఆదాయం ఆధారంగా అర్చకులకు జీతాలు చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలో ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయనున్నారు.