
హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ గెలుపు ఖాయమని, సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస యాదవ్ శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎంను కలిశారు. తనకు టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నిక అభివృద్ధి, సంక్షేమ పథకాల వ్యతిరేకులకు చెంపపెట్టు అవుతుందని అన్నారు. టీఆర్ఎస్ పై ప్రజాభిమానాన్ని తెలియజెప్పేందుకు వచ్చిన మంచి అవకాశమిదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ కు సూచించారు. గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, హుజురాబాద్ లో గెలిచి పార్టీ ప్రతిష్ఠను పెంచుతానని అన్నారు.