
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం హయాంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా, వాటిని సవాలుగా తీసుకొని పని చేశామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కరోనాని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనే వాళ్లమని చెప్పారు.
ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి నరసింహారావు, వారి కుటుంబ సభ్యులను మచిలీపట్నంలో వారి నివాసం లో చంద్రబాబు పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. కొల్లు రవీంద్రకు నరసింహారావు మామ అవుతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొన్న ఈ ప్రభుత్వం వారికి ఇంకా డబ్బులు ఇవ్వలేదని అన్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వాలని అడిగితే మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కొంత కాలం మాత్రమే పాలించగలరని, రైతులు తిరగబడితే తట్టుకోలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు కూడా హుందాగా పని చేయాలని అన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయనను నమ్ముకున్నోళ్లంతా జైలుకు వెళ్లారని వ్యాఖ్యానించారు. ఆయన కోసం తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అన్నారు.