
విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అలాగే విద్యార్థులు లేని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకూడదు అనుకుంది . ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే ప్రస్తుతమున్న ఖాళీల్లో సుమారు 2 వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే అవకాశమే లేదు. విద్యార్థులు లేని బడులలో టీచర్ల భర్తీ ద్వారా ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు లేని స్కూళ్లలో ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు 2 వేల ఉపాధ్యాయుల పోస్టులు విద్యార్థులు లేని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో 12 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా ఒక్కో టీచర్ కు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మంది హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థులు ఉండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసందానం చేస్తారు.