
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున హామీల జల్లు కురిపించారు. ఉచిత కరెంట్ తో పాటు కరెంట్ బిల్లుల బకాయిలు, తప్పుడు బిల్లులను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కేజ్రీవాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమను అధికారంలోకి తీసుకొస్తే, ఢిల్లీలోలాగా, ఉత్తరాఖండ్ లోనూ కరెంట్ కోతలు లేకుండా చూస్తామన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ను ఇస్తామన్నారు . ప్రస్తుతం పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రానికి సీఎం అంటూ లేడని, తమ ముఖ్యమంత్రి చెడ్డవాడంటూ అధికార పార్టీ వారే చెబుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవి కోసం బీజేపీలో అంతర్గత పోరు నడుస్తుందని ఆరోపించారు. ఇటు ప్రతిపక్షానికీ కూడా సరైన నేతలు లేరని అన్నారు. అలాంటప్పుడు ఉత్తరాఖండ్ అభివృద్ధిని పట్టించుకునే వారేవరని ప్రశ్నించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 20 నుంచి 22 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కాగా, అంతకుముందు కేజ్రీవాల్ పంజాబ్ లోనూ ఇలాంటి హామీలనే ఇచ్చారు. ఢిల్లీలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను అందిస్తున్నామని, పంజాబ్ లో 300 యూనిట్లను ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు.