
తెలంగాణ లో రాజకీయాలు హాట్ హాట్ గా వున్నాయి. ఇటు అధికార పార్టీ తో పాటు, ప్రతిపక్ష పార్టీ తమ ఉనికి చాటు కునేందుకు తహ తహ లాడుతున్నాయి. ఈ మధ్య తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం లో ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ కి తెర పడింది. ఈ రోజు సీఎం కెసిఆర్ హుజురాబాద్ లో ఈటెల పై పోటీకి సిద్దపడే వ్యక్తి ని పరిచయం చేసారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని ఆ పార్టీ ప్రకటన చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో పలు సార్లు అరెస్టయి జైలుకెళ్లారని చెప్పింది. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పింది.