
తెలంగాణ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఈటెలపై ఘాటు విమర్శలు చేశారు. ఈటెల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అన్యాయం చేయలేదని అన్నారు. 2003 ఎలక్షన్ లో ఎంత కష్టమైనా ఈటెలకు టికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో వుంటూ ఈటెల రాజేందర్, అనేక పదవులను అనుభవిస్తూ, ఇతర పార్టీల వాళ్ళతో సంప్రదింపులు జరిపారని దుయ్యబట్టారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అక్కడే మాట్లాడితే పోయేదని, అయితే సానుభూతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి పార్టీకి ఆయనే దూరమయ్యారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ పార్టీల మధ్యే ఉంటుందని, వ్యక్తుల మధ్య కాదని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బండి సంజయ్ పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన ఏడేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి ఏం చేసిందో చెప్పే ధైర్యం ఇక్కడి బీజేపీ నేతలకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య తప్ప విపక్షాలకు మాట్లాడేందుకు మరో అంశం లేదని చెప్పారు.